వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఉమ్మడి కృష్ణాజిల్లా కూడా చాలా కీలకం. జిల్లా ప్రజలు మొదటి నుంచి కూడా టీడీపీకి అండగా ఉండేవారు. అలాంటిది తొలిసారి టీడీపీని కాదని 2019 ఎన్నికల్లో రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీకే పట్టం కట్టారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే మాదిరిగా సీట్లు గెలవాలని భావిస్తున్నారు. కాని నేతల మధ్య అధిపత్యపోరు ..అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్ల మధ్య వర్గపోరు ఎక్కువైంది. నేరుగానే ఒకరుపై మరొకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లడంతో అక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది.
ఈ నేపథ్యంలో పార్టీ అధినేత జగన్ రంగంలోకి దిగి.. ఇరువురు నేతలతో భేటీ అవడానికి రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగానే తాజాగా మైలవరం వైసీపీ కార్యకర్తలతో జగన్ సమవేశం అయ్యారు. ఈ సందర్భంగా గన్ మాట్లాడుతూ.. మైలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టామని.. వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ జెండానే ఎగరాలని జగన్ కార్యకర్తలకు దిశనిర్ధేశం చేశారు. పార్టీలో విభేదాలున్న నియోజకవర్గాలపై జగన్ ఫోకస్ పెట్టారు. వరసగా నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమై నేరుగా వారితో చర్చిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తాను అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలని హితబోధ చేస్తున్నారు.
ఒక్కటై ఉంటేనే ప్రత్యర్థులను సులువుగా ఓడించవచ్చని, అందుకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ చిత్తశుద్ధితో కలసికట్టుగా పనిచేయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రతి కుటుంబానికి చేరుతున్నాయా? లేదా? అన్నది చూడాలని, వాటిపై ప్రచారం చేయాలని కోరారు. జనవరి నుంచి బూత్ కమిటీలను నియమిస్తామని తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలో ఒక బూత్ కమిటీ ఉంటుందన్నారు. బూత్ కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో ఒక మహిళ కూడా ఉంటారని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు 175 చోట్ల గెలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగన్ కోరారు. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాదే పోటీ చేస్తారని జగన్ స్పష్టం చేశారు. అందరు కూడా కలిసి కట్టుగా పని చేసి పార్టీని మరోసారి అధికారంలోకి వచ్చేలా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో మైలవరం టికెట్ వసంతకే అని తెలపడంతో… మంత్రి జోగి రమేష్ వర్గానికి షాకిచ్చినట్లు అయింది.