జనం.. జగన్ ఇదొక విడదీయరాని బంధంగా కనిపిస్తుంది. జగన్ రాజకీయ జీవితంలోనే అత్యంత గడ్డు స్థితిని ఎదుర్కొన్న 2024 సాధారణ ఎన్నికల ముంగిట జగన్ సభలకు వచ్చిన జనాలను చూస్తే ఎవ్వరూ జగన్ ఓడిపోతారనే అభిప్రాయానికి రాలేదు. అంతగా సిద్ధం సభలు నుంచి ప్రతీ కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. దాంతో జగన్ భారీగా ప్రభావాన్ని చూపిస్తారని ఆశిస్తే.. జనం జగన్ సభలకు వచ్చిన దానితో సంబంధం లేకుండా తీర్పు ఇచ్చారు. జగన్ ఘోర పారాభవాన్ని ఎదుర్కొన్నారు. ఓటమి తరువాత ఏడాది కాలంగా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పెద్దగా ప్రజల్లోకి వెళ్లేందుకు పూనుకోవడం లేదు. తొలుత పార్టీని చక్కదిద్దుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. దానికి తగ్గట్టుగా పార్టీ అంతర్గత కమిటీలు, ఇతర ఏర్పాట్లు, నాయకుల మార్పులు, చేర్పులు వీటిన్నింటిపై దృష్టి పెట్టారు. దానికి తగ్గట్టుగా వారంలో మూడు, నాలుగు రోజులపాటు రివ్యూ సమావేశాలు, ముఖ్యమైన నేతలతో మంత్రాంగాలు, అనేక మంది కార్యకర్తలతో సమావేశాలు.. ఇంలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
అనేక సందర్భాల్లో అడపాదడపా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జగన్ పూనుకుంటున్నారు. అందులో ముఖ్యంగా తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు పరామర్శలు, ఓదార్పులు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల సందర్భంగా కూడా జగన్ కోసం జనాలు తరలివస్తున్నటువంటి తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల తెనాలిలో తన పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే శివ కుమార్ ఇంట వివాహ వేడుకకు వెళితే జగన్మోహన్ రెడ్డి కోసం వేలాదిగా జనాలు తరలివచ్చారు. తండోపతండాలుగా జనాలు రావడం అన్నది పెద్ద చర్చకు ఆస్కారమిచ్చింది. తెనాలిలో ఘోర పరాభవం పాలైన నాయుకుడి కోసం ఇంత పెద్ద సంఖ్యలో జనాలు రావడమా అన్న దానిపై అనేక రకాలుగా చర్చలు జరిగాయి. ఆ తరువాత రామగిరిలో తన పార్టీ కార్యకర్తను మర్డర్ చేసిన తరువాత పరామర్శకు వెళితే అక్కడకు వచ్చిన జనం సంఖ్య అంతూపంతూ లేదు. పెద్ద స్థాయిలో పోలీసులు ఎక్కడికక్కడ జనాన్ని నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ ఆగకుండా చివరికి హెలీకాఫ్టర్ను చుటుముట్టేసిన స్థాయిలో రాప్తాడులో జనం తరలివచ్చారు. అంతగా జనం తరలివచ్చిన తీరు చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇక తాజాగా వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం కళ్లె తండాకు జగన్ వెళ్లారు. ఆ సమయంలో జగన్ రాక కోసం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు గుమిగూడిన తీరు అనేక రకాలుగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డి కోసం జనం ఇంత పెద్ద సంఖ్యలో తరలిరావడం ఏమిటి.? అత్యంత ఘోర పరాభవాన్ని ఎదుర్కొని ఆఖరికి ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని స్థాయిలో ఉన్న పార్టీ నాయకుడికి ఈ రీతిలో ప్రజా స్పందన ఏమిటి.? అన్నది చాలా మందికి అంతుబట్టని వ్యవహారంగా మిగిలింది. ఎందుకంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కాదు 2010 కాలంలో ఓదార్పు యాత్రకు పూనుకున్న సమయంలో ఇదే రీతిలో జగన్ ఎగబడ్డారు. అప్పట్లో అర్ధరాత్రి వరకు ఇంకా చెప్పాలంటే తెల్లవారే వరకు జనం ఆయన కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.
తెల్లవారు మూడు, నాలుగు గంటలకు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు వస్తున్నప్పుడు వేచి చూసి ఎదురుచూసిన జనాలు పెద్ద సంఖ్యలో కనిపించేవాళ్లు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఆ తరువాత రాజకీయంగా అనేక అనేక అనుభవాలు ఎదురైనప్పటికీ జనాల్లో ఆదరణ తగ్గలేదని ఇటీవల కొద్దిపాటి పర్యటనలు చెబుతున్నాయి. అది వరద బాధితుల పరామర్శకు వెళ్లినా.. లేదంటే నాయకుడి ఇంట పెళ్లి కార్యక్రమానికి వెళ్లినా.. లేదంటే హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినా.. లేదంటే మిర్చి రైతులు సమస్యలు వినేందుకు వెళ్లినా ఎక్కడకు వెళ్లినా ఒకే రీతిలో జగన్ కోసం పెద్ద సంఖ్యలో జనం తరలి రావడం ఒక ఆశ్చర్యకరమైన, గమనించాల్సిన కీలకమైన రాజకీయ పరిణామం. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నప్పుడు ఇదంతా జగన్కు ఎంత మేరకు ఉపయోగపడుతుందన్న ప్రశ్న కూడా ఉంది. వాస్తవానికి జగన్ కార్యక్రమానికి దేనికి అయినా జనం వస్తున్నప్పటికీ ఓట్లు వేసే సమయానికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని 2024 ఎన్నికలు నిరూపించాయి. అయితే, మరి జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది కాలంలో నిర్వహించినటువంటి కార్యక్రమాలు ద్వారా పెద్ద సంఖ్యలో జన సమీకరణ జరగడం ద్వారా ఆయన ఏమి సాధించారంటే ఖచ్ఛితంగా కార్యకర్తల్లో విశ్వాసాన్ని కలిగించగలిగారు. కేడర్లో నమ్మకాన్ని పోగు చేయగలిగారు. ఘోర పరాభవం నుంచి చాలా వేగంగా కోలుకోగలిగారు. అతి స్వల్ప కాలంలోనే ఆయన పరాభవాన్ని మర్చిపోయి మళ్లీ మనమే వస్తున్నాం అనే నమ్మకాన్ని కలిగించగలిగాడు.
జగన్మోహన్రెడ్డి 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది అంటూ ఒకవైపు కార్యకర్తలకు నమ్మకం కలిగిస్తూనే ఆదరణ పెరుగుతోందని జనంలో విశ్వాసం కల్పించే రీతిలో జగన్ వ్యవహారశైలి ఉంది. మరి ఎంత వరకు ఉయోగపడుతుంది. ఈ తీరున జగన్ వ్యూహాత్మకంగా సాగుతున్న తీరు ఆయనకు రాజకీయంగా ఎంత వరకు తోడ్పడతాయన్నది రాబోయే ఏడాది కాలంలో జగన్ చేపట్టేబోయే కార్యక్రమాలు మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 2027 నుంచి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాలని జగన్ ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అలాంటి దాదాపు ఐదు వేల కిలో మీటర్లు పైబడిన పాదయాత్రకు పూనుకుంటున్న తరుణంలో రాబోయే ఏడాదికాలంపాటు ఏ రీతిన సాగుతారు. జనంలో ఎంత వరకు ఉంటారు. ఆ జనం నుంచి జగన్కు వచ్చే స్పందనను ఎంత వరకు పార్టీ పరంగా, రాజకీయంగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతారు. ముఖ్యంగా ఈ స్పందనను ఓట్లుగా మళ్లించుకోవడానికి ప్రయత్నాలు ఏ తీరున ఉంటాయి. వీటిని బట్టి ఆ పార్టీకి, ఇప్పటి వరకు జగన్ కోసం తరలివస్తున్న జనం సందోహం యొక్క ఉత్సాహం ఉపయోగపడుతుందీ అని చెప్పవచ్చు.