నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారా? టిడిపి నేతల వైఖరితో మనస్థాపానికి గురయ్యారా? పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికలకు ముందు సైకిల్ ఎక్కారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టిడిపిలో అనుకున్న గౌరవం దక్కుతుండడంతో వేమిరెడ్డి సైతం ఖుషి గా ఉన్నారు. మొన్న ఆ మధ్యన ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా కూడా అవకాశం ఇచ్చారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వేమిరెడ్డి నియమితులు కావడంతో.. ఆయన అనుచరులు సంతోషించారు. వైసీపీలో దక్కని గౌరవం.. టిడిపిలో దక్కుతోందని ఆనందపడ్డారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ వేంరెడ్డి గత కొంతకాలంగా టిడిపి నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. టిడిపి కంటే వైసీపీ నయం అని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీలో బలమైన నేతగా కొనసాగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనకు ఎంతగానో గౌరవం ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ప్రమోట్ చేశారు. వైసీపీకి ఆర్థికంగా అండగా నిలిచారు వేమిరెడ్డి. నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. ఎన్నికలకు ముందు నుంచే నెల్లూరు పార్లమెంట్ సీటును కేటాయించారు జగన్. అయితే కొందరు వైసీపీ నేతల తీరు నచ్చక అసంతృప్తిగా ఉండేవారు వేమిరెడ్డి. ఈ తరుణంలో కొందరు అసెంబ్లీ అభ్యర్థులను మార్చాలని జగన్ ను కోరారు. ఆయన వెనక పోవడంతో కొద్దిరోజుల పాటు సైలెంట్ అయ్యారు. సరిగ్గా ఎన్నికలకు ముందు టిడిపిలోకి జంప్ చేశారు. వాస్తవానికి నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ కు ప్రాధాన్యమిచ్చారు జగన్. ఇది వేమిరెడ్డికి మింగుడు పడలేదు. దానికి తోడు రాజ్యసభ పదవీకాలం అప్పట్లో ముగిసింది. కానీ జగన్ నుంచి ఆశించిన స్థాయిలో హామీ రాలేదు. పైగా పార్లమెంట్ స్థానం పరిధిలో తనకు ఇష్టం లేని వారికి టిక్కెట్లు ఇచ్చారు జగన్. దీంతో వైసీపీలో ఉండడం కంటే బయటకు వెళ్ళిపోవడమే మేలు అన్న నిర్ణయానికి వచ్చారు వేమిరెడ్డి. అందుకే తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు. తన భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు టికెట్ ఇప్పించుకున్నారు. ఇద్దరూ గెలిచారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ఎప్పటికప్పుడు అలకబూనుతూ వస్తున్నారు వేమిరెడ్డి.
రెండు నెలల కిందట నెల్లూరు జిల్లా టిడిపి కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మహమ్మద్ ఫరూక్, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే సమావేశానికి హాజరవుతున్న క్రమంలో మంత్రులకు కొందరు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మాత్రం ఎవరు పుష్పగుచ్చం అందించలేదు. దీనిని అవమానంగా భావించిన వేమిరెడ్డి సభా వేదిక దిగి బయటకు వెళ్లిపోయారు. వెంటనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రంగంలోకి దిగారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని వేమిరెడ్డిని తిరిగి సమావేశానికి తీసుకొచ్చారు.
అంతకుముందు ఒకసారి ఇలానే అలిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం తో పాటు డిఆర్సి మీటింగ్ జరిగింది. ఆ సమయంలో సభకు అధ్యక్షత వహించిన ఆర్డిఓ ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటించలేదు. దీంతో తీవ్ర అవమానంగా భావించిన ఆయన తన భార్య ప్రశాంతి రెడ్డిని తీసుకొని కారులో కూర్చున్నారు. వెళ్లిపోయేందుకు ఉపక్రమించగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వారిని వారించారు. సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే వేమిరెడ్డి మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట ఉండలేనని తేల్చి చెప్పారు. అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. అయితే చిన్న చిన్న వాటికి కూడా వేమిరెడ్డి అలకబూ నడం ఏంటి అనేది టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి చిన్న అంశానికి అసంతృప్తి వ్యక్తం చేయడం తగదు అంటున్నారు. అయితే వేమిరెడ్డికి టిడిపిలో ఆశించిన స్థాయిలో గౌరవం దక్కడం లేదని తెలుస్తోంది. అందుకే ఆయన ఇటీవల టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం నడిచింది.
అయితే కొద్ది రోజుల కిందట ఆయన సాక్షి పత్రికకు ఫుల్ పేజీ యాడ్ ఇవ్వడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సాక్షికి రాష్ట్రవ్యాప్తంగా ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు వేమిరెడ్డి. చంద్రబాబు లోకేష్ తో కూడిన భారీ ఫోటోలను అందులో పొందుపరిచారు. అయితే ఆయన అభిమానులు మాత్రం కేవలం తనకు టిడిపిలో దక్కుతున్న గౌరవాన్ని చాటి చెప్పేందుకే సాక్షి మీడియాకు యాడ్ ఇచ్చారని చెబుతున్నారు. కానీ వేమిరెడ్డి అసంతృప్తితో ఉన్నారనడానికి సంకేతాలు ఇచ్చేందుకే అలా చేశారన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో వేంరెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆయన క్రమేపి తెలుగుదేశం పార్టీకి దూరంగా జరుగుతున్నారని ప్రచారం నడుస్తోంది. మున్ముందు ఈ పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయో చూడాలి.