Thursday, March 28, 2024

వద్దనుకుంటున్నారా..? వదిలించుకుంటున్నారా..?

- Advertisement -

తప్పుకున్నారా..? తప్పించారా..?

గుంటూరు జిల్లాలో అధికార పార్టీలో అసమ్మతి ఎక్కువైందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. జిల్లాలో అధికార వైసీపీ పార్టీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందని .. అది ఏ క్షణంలో అయిన పేలవచ్చనే అభిప్రాయం వెల్లడవుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని పార్టీ అధినేత జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కాని పార్టీ నాయకుల తీరు మాత్రం ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా ఉంది. పైకి అంత బాగానే ఉందని కల్లరింగ్ ఇస్తున్నప్పటికి కూడా లోపల మాత్రం ఛాన్స్ వస్తే .. తమ నాయకులనే ఓడించాలని గట్టి పట్టుదలతో కొందరు పని చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవి మొదలుకుని…నిన్న జరిగిన మేకతోటి సుచరిత ఎపిసోడ్ వరకు అన్ని కూడా పార్టీకి చేటు చేసేలాగే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే శ్రీదేవిని నియోజవర్గ బాధ్యతల నుంచి తొలగిస్తు.. ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్‌కు అప్పగించడం సంచలనంగా మారింది.

దీనిపై ఆమె తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికి లాభం లేకుండా పోయింది. దీని తరువాత పొన్నూరు నియోజవర్గంలో తొలి నుంచి పార్టీలో ఉన్న రావి వెంకటరమణను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారని చెప్పి నుంచి సస్పెండ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇది కూడా పార్టీకి తీరని లోటే అని చెప్పాలి. ఈ ఎపిసోడ్ ముగిసింది అనుకునేలోపే మాజీ హోం మంత్రి, జగన్‌కు అత్యంత దగ్గరైన వ్యక్తులలో ఒకరైనా మేకతోటి సుచరిత కూడా పార్టీలో తనకున్న పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ వెంట నడిచిన వారిలో మేకతోటి సుచరిత కూడా ఒకరు. జగన్ కష్టకాలంలో ఆయన వెంట నడిచిన వారిలో మేకతోటి సుచరిత కూడా ఒకరు. అటు జగన్ కూడా మేకతోటి సుచరితకు తగిన ప్రాధాన్యం ఇస్తు వచ్చారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలలో విజయం సాధించిన ఆమె 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు.

మళ్లీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన చోటే విజయం సాధించారామె. జగన్ తొలి క్యాబినెట్‌లో హోమంత్రిగా కూడా పదవిని అప్పగించారు. మంత్రివర్గ పున:వ్యవస్థీకరణలో భాగంగా ఆమె మంత్రి పదవిని కోల్పోవడం జరిగింది. దీనిని తట్టుకులేని ఆమె.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తరువాత పార్టీ పెద్దలు నచ్చ చెప్పడంతో.. జగన్‌తో భేటీ అయి ..ఆయన అడుగు జాడాల్లో నడుస్తానని వెల్లడించారు. ఆ సమయంలోనే జగన్ ఆమెకు జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. తాజాగా మేకతోటి సుచరిత జిల్లా అధ్యక్షురాలు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.

తాను అధ్యక్ష పదవికి రాజీనామాకు ప్రత్యేకంగా కారణాలు ఏవీ లేవని, తన నియోజకవర్గం పైన ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. కాని లోపల మాత్రం వేరే కారణం ఉందని తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలోకి వచ్చిన వారి పెత్తనం ఎక్కువ కావడంతోనే.. మేకతోటి సుచరిత జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్లుగా నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారట. పైగా వచ్చే ఎన్నికలలో ఆమె పోటీకి దూరంగా ఉండాలని కూడా భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. జిల్లాపై జగన్ దృష్టి పెట్టకపోతే… చాలానే నష్టం వాటిల్లుతుందని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ అధినాయకత్వం కూడా స్పందించకపోవడం విశేషంగా మారింది. మేకతోటి సుచరితను వద్దనుకుంటున్నారా..? వదిలించుకుంటున్నారా..? అనేది ఎవరికి అర్థం కావడం లేదు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!