Sunday, June 29, 2025

కొడాలి నాని రాజకీయ గురువు హరికృష్ణ.. ప్రోత్సహించింది జూనియర్ ఎన్టీఆర్!

- Advertisement -

కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు.. అలియాస్ నాని. కొడాలి నాని పేరులోనే ఒక బ్రాండ్ ఉంది. తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు. తాను ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి.. అధినేతకు వీర విధేయత ప్రదర్శించడం కొడాలి నానికి అలవాటైన విద్య. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడడంలో ఆయన స్టైలే వేరు. అదే ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. అదే స్థాయిలో వివాదాల్లోకి నెట్టింది. ప్రస్తుతం అనారోగ్యంతో ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నాని. ఈ క్రమంలో కొడాలి నాని పై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. అయితే కొడాలి నాని రాజకీయ ప్రవేశం వెనుక నందమూరి కుటుంబ ప్రోద్బలం ఉంది. ఇప్పుడు అది మరోసారి చర్చకు వస్తోంది.

కొడాలి నాని 1971 అక్టోబర్ 22న గుడివాడలో కొడాలి అర్జున్ రావు దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు. చిన్నప్పటి నుంచి దూకుడుగా ఉండేవారు. చదువుపై అంతగా శ్రద్ధ లేకపోవడంతో పదో తరగతి వరకు చదివి ఆపేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో పాలిటిక్స్ పట్ల విపరీతమైన మక్కువ. అలా తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. నందమూరి తారక రామారావు అంటే విపరీతమైన అభిమానం చూపేవారు.

ఎన్టీఆర్ గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అది మొదలు ఆ కుటుంబంతో సాన్నిహిత్యం పెంచుకున్నారు కొడాలి నాని. ముఖ్యంగా నందమూరి హరికృష్ణకు చాలా దగ్గరయ్యారు. ప్రతి విషయంలోనూ హరికృష్ణకు చేదోడు వాదోడుగా నిలిచేవారు. కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కు ఒక పెద్దన్నయ్య మారిపోయారు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ సినీ జీవితంలో కూడా తన వంతు సహాయం అందించారు కొడాలి నాని. అదే సమయంలో రాజకీయాల్లోకి వెళ్లాలని ఉందని ఆసక్తి చూపారు కొడాలి నాని. వెంటనే నందమూరి హరికృష్ణ కృష్ణ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. అందుకే హరికృష్ణ ను రాజకీయ గురువుగా అభివర్ణిస్తారు కొడాలి నాని.

2004లో తొలిసారిగా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కొడాలి నాని. అయితే ఆ సమయంలో నందమూరి హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని కోసం పట్టుపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సిందేనని చంద్రబాబుకు తేల్చి చెప్పారు. అవసరం అనుకుంటే కొడాలి నానితో ఇండిపెండెంట్గా పోటీ చేయిస్తామని కూడా హరికృష్ణ హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. అందుకే చంద్రబాబుకు వేరే దారి లేక ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అది మొదలు కొడాలి నాని తన ఆరాధ్య దైవంగా నందమూరి హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్కు భావిస్తూ వచ్చారు.

2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఉమ్మడి రాష్ట్రం వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో నందమూరి హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు పక్కన పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే దానిని సహించుకోలేకపోయారు కొడాలి నాని. అందుకే 2012లో టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది అప్పట్లో విను దుమారానికి దారితీసింది. కేవలం నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాన్ని సహించలేక ఆయన పార్టీ మారినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది.

అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైన ఆరాధన భావం చూపేవారు. హరికృష్ణ మరణం సమయంలో చాలా బాధపడ్డారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా మాట్లాడేవారు. వారి విషయంలో చంద్రబాబు వ్యవహార శైలిని తప్పుపట్టారు.

అయితే తాజాగా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు కొడాలి నాని. ఈ సమయంలో కూడా సోషల్ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది. కొడాలి నాని రాజకీయ ఉన్నతికి ముమ్మాటికి నందమూరి హరికృష్ణ కారణమని.. జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే ఆయన ఈ స్థాయికి చేరారని ఒక చర్చ అయితే ప్రజల్లో బలంగా ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!