Sunday, June 29, 2025

19న మేయర్ పై అవిశ్వాసం? రసకందాయంలో విశాఖ రాజకీయం

- Advertisement -

విశాఖ మేయర్ పీఠానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందా? 19న అవిశ్వాస తీర్మానానికి కూటమి ఫిక్స్ అయిందా? ఆ తేదీని ఖరారు చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టిడిపి పావులు కదుపుతోంది. అయితే భయం భయంగానే ఉంది ఆ పార్టీ. ఏమాత్రం బెడిసి కొట్టిన ఇమేజ్ కు డామేజ్ తప్పదు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది.

విశాఖ విషయంలో ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కడప జిల్లా పరిషత్ పీఠాన్ని పదిలం చేసుకున్న ఆ పార్టీ.. అదే వ్యూహాన్ని విశాఖలో అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్ లను శిబిరాలకు తరలించింది. బెంగళూరు తో పాటు హైదరాబాద్ శిబిరాల్లో ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. అవసరం అనుకుంటే మలేషియా తరలిస్తారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కూటమిలో కూడా ధీమా కనిపిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. ఆ పార్టీకి ఎక్స్ అఫీషియో సభ్యుల రూపంలో 12 మంది బలం ఉంది. ఆపై ఎన్నికలకు ముందు.. ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కారు. మరికొందరు జనసేన గూటికి చేరారు. అందుకే కూటమిలో ఆ ధీమా కనిపిస్తోంది.

అయితే తాంబూలాలు ఇచ్చి చాలా రోజులు అవుతుంది. కానీ శుభకార్యం జరగలేదన్నట్టు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి డేట్ ఫిక్స్ కాలేదు. ఇక్కడే అనుమానం కొడుతోంది. కూటమికి తగినంత బలం లేనందునే వెనుకడుగు వేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. పైకి మేకపోతు గాంభిర్యం ప్రదర్శిస్తోందని.. కానీ లోలోపల మాత్రం గుబులు నెలకొందని.. అవిశ్వాస తీర్మానం ఓడిపోతే మాత్రం కూటమికి డ్యామేజ్ తప్పదని టిడిపి భయపడుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు క్యాస్ట్ ఈక్వేషన్ విశాఖలో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వైసీపీ మేయర్ హరి వెంకట కుమారి యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ నేత. పైగా వివాదరహితురాలిగా పేరు ఉంది. గత నాలుగేళ్లలో జీవీఎంసీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారన్న పేరు ఉంది. అటువంటి మహిళను పీఠం నుంచి దించితే ఎవరు మేయర్ అవుతారు అనేది ప్రశ్న.

ఒక బీసీ మహిళ నేతను అగౌరవపరచడం అవుతుందని కూటమి పార్టీల్లో కూడా ఒక రకమైన ఆందోళన ఉంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అవిశ్వాస తీర్మానంలో ఓడిస్తే మేయర్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. అయితే కూటమిలో మేయర్ పదవి ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు. పైగా కూటమి శిబిరానికి వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం యుటర్న్ తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మహా అయితే ఒక ఏడాది పదవి ఉంటుందని.. కూటమిలోకి వెళ్లిన పెద్దగా ప్రయోజనం లేదని ఆవేదనతో ఉన్న కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో విశాఖ మేయర్ పీఠం అంటేనే ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది. చివరికి కూటమి ఎలా తగ్గించుకుంటుందో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో.. చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!